రుద్రూర్, జూలై 8: రాష్ర్టాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ఎంఈవో కార్యాలయం, రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు.కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. అనంతరం రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి గుంటకూ, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధ జలాలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రుద్రూర్ నుంచి బోధన్ వరకు రోడ్డు మరమ్మతులకు రూ. మూడు కోట్ల మంజూరుకు కృషి చేశామన్నారు.
రుద్రూర్ మీదుగా త్వరలో నేషనల్ హైవే నిర్మిస్తారన్నారు. మెదక్ నుంచి ఎల్లారెడ్డికి రూ.250కోట్లు, ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు రూ.300 కోట్లతో మద్నూర్ నుంచి కోటగిరి, రుద్రూర్ మీదుగా జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తారని వివరించారు. డబుల్బెడ్రూం ఇండ్లను అర్హులకు మాత్రమే కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేదిలేదని హెచ్చరించారు. అనంతరం సులేమాన్ నగర్లో మొక్క లు నాటారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ అక్కపల్లి సుజాత, జడ్పీటీసీ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, సర్పంచులు చంద్రశేఖర్, ఖాదర్, ఏసీపీ రామారావు, ఏఎంసీ చైర్మన్ సంజీవ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ సంగయ్య, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో బాలగంగాధర్, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.