కూసుమంచి(నేలకొండపల్లి), మే 9 : ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెసోళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని, నిరంతరం అభివృద్ధి గురించి పాటుపడే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి, రాజేశ్వరపురం గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కందాల గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పింఛన్లు రూ.4 వేలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు.. చేశారా? కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు.. ఇచ్చారా? అంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాలకు పెద్దపీట వేసిందని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాయని, అవన్నీ కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి నామాను గెలిపించాలని కోరారు. నామా గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, నాయకులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.