కంఠేశ్వర్/ఆర్మూర్, మే 8: పదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆర్మూర్, నిజామాబాద్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. ప్రధానిగా మోదీ పదేండ్లు ఉండి, ఎంపీగా అర్వింద్ ఐదేండ్లు ఉండి నిజామాబాద్కు స్మార్ట్సిటీ తీసుకురాలేదని విమర్శించారు. చెరుకు రైతులకు మద్దతు ధర తీసుకురాలేదన్నారు.
అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మారుస్తానని అంటున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు మీరు ఎవ్వరని, ఆ హక్కు మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. మోదీ 2020 సంవత్సరంలో జనాభా లెక్కలు, బీసీ కులగణన ఎందుకు చేపట్టలేదని అన్నారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీని ప్రభుత్వంలో లేకుండా చేస్తామన్నారు. రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలని అన్నారు. పసుపు బోర్డు అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.