వినాయక్నగర్, మే 8: నిజామాబాద్లో తమాషాలు చేయడానికి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాయని, ఎన్నికల్లో ఫండింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇవ్వాలని స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి), పీఎఫ్ఐ వంటి నిషేధిత సంస్థలు తీర్మానం చేయడం దారుణమన్నారు. నిజామాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అర్వింద్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థ అని ఆరోపించారు. దేశ సంపద మీద మొదటి హక్కు మైనార్టీలకేనని గత ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న సిమి లాంటి సంస్థలు కాంగ్రెస్కు ఫండింగ్ చేయడంతో పాటు నేరుగా మద్దతు ప్రకటిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇలాంటి టెర్రరిస్టు సంస్థల చేతుల్లో అధికారం కేంద్రీకృతం అవుతుందని తెలిపారు. నిషేధిత సంస్థలు చేసిన తీర్మానాలను కరపత్రాల రూపంలో ముద్రించి మైనార్టీల ఏరియాల్లో పంచి పెడుతున్నారని ఆరోపించారు. జగిత్యాల పీఎఫ్ఐ వంటి సంస్థలకు అడ్డాగా మారిందన్నారు.