వర్ని, మే 8: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెసోళ్లు అక్రమ కేసులు బనాయిస్తే భయపడేదిలేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీనగర్ మాజీ సర్పంచ్ రాజుతోపాటు పలువురు యువకులపై అక్ర మ కేసులు బనాయించిన విషయం తెలుసుకున్న ఆయన బుధవారం వారి ఇంటికి వెళ్లి మాట్లాడారు. కేసు వివరాలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. ఇటీవల గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో ఘటనాస్థలంలో లేని మాజీ సర్పంచ్ రాజుపై కేసు నమోదు చేయడం కాంగ్రెస్ నాయకుల నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేసి నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డిలో చేసినట్లు ఇక్కడ కూడా చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్ తదితరులు ఉన్నారు.