న్యాల్కల్, మే 9: కాంగ్రెస్ హామీలతో మోసపోయి గోసపడుతున్నామని, ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. గురువారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు నెలలైనా హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామన్నరు.. గతంలో కేసీఆర్ ఇచ్చిన రూ.10 వేలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇక రైతు బీమా ఊసేలేదని, రైతలకు ఎలాంటి భరోసా లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500, కల్యాణలక్షితోపాటు తులం బంగారం పత్తాలేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. ఇందులో ఏ ఒక్క హామీ నెరవేరినా కాంగ్రెస్కు ఓటు వేయాలని, లేకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.
కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి తెలంగాణలో కరువుఛాయలు అలుముకొన్నాయని, తాగు, సాగునీరు, విద్యత్ తదితర సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగైదు నెలల్లోనే ఇలాంటి దుర్భర పరిస్థితి నెలకొంటే వచ్చే ఐదేండ్లల్లో ఎలాంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మాణిక్రావును భారీ మెజార్టీతో గెలిపించిన మాదిరిగానే ఎంపీ ఎన్నికల్లోనూ గాలి అనిల్కుమార్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కర్త దేవీప్రసాద్, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం, తదితరులు పాల్గొన్నారు.