
(Book Releasing) హైదరాబాద్: సామాన్య ప్రజల జీవనం ఇతివృత్తంగా ‘ఇగురం’ కథలు ఉన్నాయని పలువురు వక్తలు కొనియాడారు. గంగాడి సుధీర్ కలం నుంచి జాలువారిన కథల సంపుటి ‘ఇగురం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ బుక్ ఫెయిర్లోని చిందు ఎల్లమ్మ వేదికపై ఆదివారం రాత్రి జరిగింది. నందిని సిధారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంపాదకుడు కే రామచంద్రమూర్తి ‘ఇగురం’ కథల సంపుటిని ఆవిష్కరించారు. తొలి ప్రతిని టీ-సాట్ సీఈవో ఆర్ శైలేష్రెడ్డికి అందించారు. తన తొలి కథా సంపుటిని తల్లికి అంకితమివ్వడం పట్ల అక్కడికి వచ్చిన వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, గంగాడి సుధీర్ తొలి కథా సంపుటిని చాలా బలంగా తీసుకొచ్చాడని కొనియాడారు. ఆర్కే నారాయణ మాల్గుడి కథలకు సమానమైన నేపథ్యంతో తన ఊరు ఆవునూరుని ప్రకటించాడని చెప్పారు. రెండు దశాబ్దాల జర్నలిస్ట్ జీవితం, అంతకు ముందరి గ్రామీణ నేపథ్యం కారణంగానే సుధీర్ ఇలాంటి కథల్ని బలంగా వ్యక్తీకరించగలిగారన్నారు. కథల్లో పాత్రలను నడిపే తీరు, వాటి వ్యక్తిత్వాలను సమగ్రంగా రూపొందించే రచనా నైపుణ్యం, ఆకట్టుకునే శైలికి తోడు తెలంగాణ నుడికారాన్ని అత్యంత సహజంగా వ్యక్తీకరించి చదువరులను ఆకట్టుకునేలా పుస్తకాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. ప్రస్తుత సమాజాన్ని మళ్లీ పుస్తక పఠనం వైపు చూపు తిప్పుకునేలా, యువతకు పుస్తకాలను చదివే ఆసక్తిని రగిలించేలా గంగాడి సుధీర్ కథా సంపుటి ‘ఇగురం’ ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, కవి సిద్దార్థ, టీడీఎఫ్ యూఎస్ఏ అధ్యక్షురాలు కవితా చల్ల, బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర తదితరులు పాల్గొని రచయిత గంగాడి సుధీర్ను అభినందించారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..