సిద్దిపేట : వరి పంటను వెదజల్లే పద్ధతిలో పండిస్తే అధిక లాభాలు వస్తాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గురువారం కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామ శివారులోని యాట నర్సింలు రైతు సాగు క్షేత్రం వేదికగా పొలంలో స్వయంగా దిగి వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పొలం వద్దే రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2-3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
ఈ వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పంటను సులభంగా నాటుకోవచ్చని సూచించారు. నారు పోసే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం గొడవ లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుందన్నారు. మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపొడ్లు సరిపోతాయని మంత్రి పేర్కొన్నారు.
వడ్లు సల్లినంక ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చునని చెప్పారు. విత్తనపొడ్లు వెదజల్లినంక వర్షం పడే దాక కొన్నిరోజులు ఎదురు చూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగు నీటి ప్రాజెక్టులు, సిద్దిపేట జిల్లాలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్ధతిని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే అంశంపై సిద్దిపేట జిల్లా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశిచారు.
ఇవి కూడా చదవండి..
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల
వనపర్తి జిల్లాలో నూతన కోర్టులు ప్రారంభం
ల్యాబర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరూరి