వనపర్తి : వనపర్తి జిల్లాకు మంజూరైన రెండు నూతన కోర్టులు.. ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను ఆన్లైన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ అభిషేక్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడుతూ.. నూతన కోర్టుల ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వ చొరవ అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కోర్టుల సంఖ్య పెరిగిందన్నారు. తాను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తక్కువ కాలంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇది రెండవది అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. కోర్టుల ఏర్పాటు మూలంగా బాధితులకు సత్వర న్యాయం అందేందుకు తోడ్పాటునిస్తుంది అని తెలిపారు. వనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న ప్రస్తుత వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం అని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి అన్నారు.