దండేపల్లి, జూన్ 8 : ప్రభుత్వ నిషేధిత హానికర గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. అక్రమంగా అంబర్ ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2.10 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం దండేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గూడెం చెక్పోస్ట్ వద్ద లక్షెట్టిపేట సీఐ నారాయణ్ నాయక్, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వం నిషేధించిన 6 అంబర్ బస్తాలు గుర్తించామన్నారు. నిందితులు బీ సురేశ్, నరేశ్, ఎస్ సురేశ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నారాయణ్నాయక్, ఎస్ఐలు శ్రీకాంత్, మధుసూదన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
గుట్కా విక్రయిస్తే పీడీ యాక్ట్..
జైపూర్, జూన్ 8: గుట్కాలను విక్రయిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తామని జైపూర్ ఏసీపీ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు గుట్కా విక్రయిస్తున్న వారిపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. జైపూర్ సబ్ డివిజన్ పరిధిలో గుట్కా, అంబర్, ఖైనీ, ఫుల్చాప్ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయాలు చేపట్టే వారిపై తనిఖీ ముమ్మరం చేశామన్నారు. గుట్కాతో పాటుగా మరిన్ని అక్రమ వ్యాపారాలు చేసే వారి జాబితాను సిద్ధం చేసినట్లు హెచ్చరించారు.
మందమర్రిలో..
మందమర్రి జూన్ 8 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని యాపల్ ఏరియాలో రామగుండం టాస్క్ఫోర్స్, మందమర్రి పోలీసులు మంగళవారం కిరాణం దుకాణంపై దాడి చేసి నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకుని వాటిని విక్రయిస్తున్న వ్యాపారి దాసరి రఘుపతి ని అదుపులోకి తీసుకున్నారు. రూ.5850 విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయని రామగుండం టాస్క్ఫోర్స్ సీఐ మహేందర్, ఎస్ఐ భూమేశ్ తెలిపారు.
తాండూర్ సర్కిల్ పరిధిలో..
తాండూర్, జూన్ 8 : తాండూర్ సర్కిల్ పరిధిలో భీమిని కన్నేపల్లి, తాండూర్ మండలాల్లో దుకాణాల్లో తనిఖీ చేసి అంబర్, ఫుల్ చాప్ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామని తాండూర్ సీఐ కోట బాబురావు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుందన్నారు. నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో తాండూర్, భీమిని, కన్నెపల్లి ఎస్ఐలు కిరణ్కుమార్, కొమురయ్య, ప్రశాంత్రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.
సోమగూడెంలో..
కాసిపేట, జూన్ 8 : సోమగూడెం భరత్ కాలనీ చౌరస్తాలోని అరీఫ్ పాన్ షాప్లో రూ.2525 విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కె నరేశ్ తెలిపారు. మహ్మద్ అరీఫ్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.