హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో బుధవారం నుంచి ఉపాధ్యాయులందరికీ ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉపాధ్యాయులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు రావాల్సి ఉంటుందని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పాఠశాల ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. 2018లో ఉపాధ్యాయ బదిలీలు జరగ్గా, మళ్లీ ఈ ఏడాది బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దాంతో వెబ్కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు సిద్ధంచేస్తున్నది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు 8 ఏండ్లు, గెజిటెడ్ హెచ్ఎంలు 5 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి బదిలీలు తప్పనిసరి కాగా, రెండేండ్ల సర్వీసు పూర్తయినవారు కూడా బదిలీలకు దరఖాస్తు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గన్ఫౌండ్రీలోని మంత్రి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉపాధ్యాయ పదోన్నతులు, సాధారణ బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు తదితరాలపై విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్, కమిషనర్ శ్రీదేవసేన, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పాల్గొన్నారు. బదిలీల షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో బదిలీల ప్రక్రియ మొత్తం వెబ్కౌన్సిలింగ్ ద్వారా చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఇదే విధానంలో బదిలీలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు. ముందుగా ఉపాధ్యాయ ఖాళీలను నోటిఫై చేసి టీచర్ల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చి బదిలీలు చేపడతారు. ఎన్సీసీ ఉపాధ్యాయులకు మాత్రం తక్కువ పోస్టులున్న కారణంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
సానుకూలంగా స్పందించడం హర్షణీయం: పీఆర్టీయూ
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను త్వరగా చేపట్టాలని అధికారులను మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించడంపట్ల పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పదోన్నతులు కూడా..
పదోన్నతులపైనా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమస్యలేమీ ఎదురుకాకుండా.. ప్రాథమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులను సృష్టించిన తర్వాత పదోన్నతులు కల్పించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే 5,571 కొత్త పోస్టుల మంజూరుకు ఫైల్ను రూపొందించారు. దీనిని విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్కు, అక్కడి నుంచి ఆర్థిఖశాఖకు, ఆ తర్వాత ప్రభుత్వానికి పంపించనున్నారు. ప్రభుత్వ ఆమోదం రాగానే, అన్నింటికీ కలిపి ఒకేసారి పదోన్నతులు కల్పించాలని భావిస్తున్నారు. చివరగా 2015లో పదోన్నతులు కల్పించారు. అంతర్జిల్లా బదిలీలకు కూడా త్వరలోనే కొత్తగా మార్గదర్శకాలు విడుదలచేయనున్నారు. ఈ ప్రక్రియను మే నెలలో పూర్తిచేయాలని యోచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం
పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?