హల్దీ వాగును జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్దే
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
మెదక్/వెల్దుర్తి, ఏప్రిల్ 7: నాలుగైదు రోజుల్లోనే గోదావరి నీళ్లు మాసాయిపేటను ముద్దాడనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. నదికే కొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్.. వాగులు, వంకలను జీవనదులుగా, రిజర్వాయర్లుగా మారుస్తున్నారని కొనియాడారు. బుధవారం మెదక్ జిల్లా మాసాయిపేట నూతన మండలాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, రఘునందన్రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి ప్రారంభించారు. వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్, బండపోసన్పల్లి గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయని ప్రజల విజ్ఞప్తి మేరకు హల్దీ వాగు ద్వారా 14 వేల ఎకరాలను సస్యశ్యామలం చేయనున్నామని తెలిపారు. మంజీర, హల్దీ వాగులపై 15 చెక్డ్యాంలను కొత్తగా నిర్మించామని, ఘనపూర్ వనదుర్గా ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని చెప్పారు. మెదక్ జిల్లాలో యాసంగిలో 2.12 లక్షల ఎకరాల్లో పంటలు పండగా, రూ.600 కోట్ల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కాలువలకు కూడా సరిగా నీళ్లియ్యలేదని, కానీ.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాలువలకే కాదు వాగులకు కూడా నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 541 మండలంగా మాసాయిపేట ఏర్పడిందని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య
మా సర్వీసును క్రమబద్ధీకరించండి