హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కార్గో రంగంలోకి ప్రవేశించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సేవలను మరింతగా విస్తరిస్తున్నది. ప్రైవేట్ సర్వీసులను తలదన్నేలా ఆర్టీసీ పార్సిల్ సర్వీసు దూసుకుపోతున్నది. ప్రారంభించిన పది మాసాల్లోనే అనూహ్యంగా పుంజుకొన్నది. మొదట రూ.30 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకొన్న ఆర్టీసీ కార్గో.. రూ.32.70 కోట్లకు చేరుకొంది. ఇకపై పార్సిల్ సర్వీస్ను అందరికీ అందుబాటులోకి తేనున్నారు. అందులో భాగంగానే డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
33 జిల్లాలకు విస్తరణ
భవిష్యత్తులో తన ఆదాయానికి ఆయువుపట్టుగా మారబోతున్న కార్గో సర్వీసులను.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు విస్తరించబోతున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రధాన బస్స్టేషన్లలో కార్గో సర్వీసు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యమైన పట్టణాల్లో కూడా సర్వీసు కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఈ కేంద్రాల ద్వారానే వినియోగదారులకు డోర్ డెలివరీ విధానాన్ని పరిచయం చేయబోతున్నామని ఆర్టీసీ కార్గో ఇంచార్జి కృష్ణకాంత్ తెలిపారు. పార్సిళ్ల పరిమాణం బట్టి ప్రత్యేక వాహనాల ద్వారా డోర్ డెలివరీ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ప్రైవేట్ పార్సిళ్లతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతోనే డోర్ డెలివరీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 65 కేంద్రా ల్లో కార్గో సేవల విస్తరణకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మండలాలకు కూడా కార్గో సేవలు విస్తరిస్తామని కృష్ణకాంత్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య
మా సర్వీసును క్రమబద్ధీకరించండి