ముంబై: తాను దేవుడినని, శివుడి అవతారమని ఒక వ్యక్తి నమ్మించాడు. ఒక మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. అతడు పలువురు మహిళలపైనా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించింది. (Claims As Godman, Man Raps Woman) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. పాల్గడ్ జిల్లాకు చెందిన 40 ఏళ్ల రిషికేశ్ వైద్య తనను తాను దేవుడిగా చెప్పుకున్నాడు. శివుడి అవతారమని నమ్మించి పలువురు మహిళలను లోబర్చుకున్నాడు.
కాగా, ఒక సామాజిక సంస్థ నిర్వహిస్తున్న రిషికేశ్ వైద్యకు 2023లో పూణేకు చెందిన 35 ఏళ్ల మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఆ ఏడాది డిసెంబర్లో అతడు పూణే వెళ్లి ఆమెను కలిశాడు. తాను మహాదేవుని (శివుని) అవతారమని, ఆమె తన ‘పార్వతి’ అని నమ్మించాడు. ఆ మహిళను ఒక లాడ్జికి తీసుకెళ్లాడు. మత్తు ప్రభావానికి గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. గత ఏడాది మేలో వసాయిలోని ఒక హోటల్కు పిలిపించి మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరోవైపు నాసిక్కు చెందిన అశోక్ ఖరత్, జ్యోతిష్కుడి ముసుగులో పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటంతో అరెస్టయ్యాడు. ఈ సంఘటన నేపథ్యంలో బాధిత మహిళ ధైర్యం తెచ్చుకున్నది. పూణేలోని మాణిక్పూర్ పోలీస్ స్టేషన్లో రిషికేశ్ వైద్యపై ఫిర్యాదు చేసింది. ఇతర మహిళలను కూడా ఇలాగే ప్రలోభపెట్టి లైంగిక దాడులకు అతడు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది.
అయితే పూణేలోని మంజరి ప్రాంతంలోని లాడ్జిలో బాధిత మహిళపై అత్యాచారం జరుగడంతో మాణిక్పూర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం పూణేలోని హడప్సర్ పోలీస్ స్టేషన్కు ఈ కేసును బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read:
Allahabad High Court | వివాహితుడితో సహజీవనం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు