Allahabad High Court : వివాహితుడైన వ్యక్తితో మేజర్ అయిన మహిళ పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చని, అది నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. నైతికతను, చట్టాన్ని వేర్వేరుగా చూడాలని స్పష్టంచేసింది. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన ఓ వివాహితుడు, 18 ఏళ్ల యువతి సహజీవనం చేస్తున్నారు. దాంతో యువతి కుటుంబసభ్యులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని సహజీవనం చేస్తున్న జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.
ఆ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్పూర్కు చెందిన 18 ఏళ్ల అనామిక, వివాహితుడైన నేత్రపాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. అయితే జనవరి 8న అనామిక తల్లి కాంతి.. తన కుమార్తెను నేత్రపాల్ ప్రలోభపెట్టి తీసుకెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు.
అయితే ఆ కేసును కొట్టివేయాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అనామిక, నేత్రపాల్ హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, ఇష్టపూర్వకంగానే కలిసి జీవిస్తున్నామని తమ పిటిషన్లో పేర్కొన్నారు. నేత్రపాల్కు అప్పటికే వివాహమైనందున, అతను మరో మహిళతో సహజీవనం చేయడం చట్టరీత్యా నేరమని యువతి కుటుంబం తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరు మేజర్లు అంగీకారంతో కలిసి జీవించినప్పుడు అందులో నేరపూరిత కోణం ఏమీ లేదని స్పష్టం చేసింది.
మేజర్ అయిన మహిళ అనామిక తన ఇష్టప్రకారమే నేత్రపాల్తో జీవిస్తున్నట్లు పోలీసులకు చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఈ సందర్భంగా తమకు కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, వారు పరువు హత్యకు పాల్పడే ప్రమాదం ఉందని అనామిక, నేత్రపాల్ జంట ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. జంటకు భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ జంట భద్రతకు స్థానిక ఎస్పీ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని ఆదేశించింది.
వారి ఇంటికి వెళ్లడంగానీ, ఫోన్ లేదా ఇతర మార్గాల ద్వారా సంప్రదించడంగానీ చేయవద్దని యువతి కుటుంబ సభ్యులను హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.