హైదరాబాద్ : రాష్ట్రంలో వరిసాగును తగ్గించి పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పంటలలో అధిక ఆదాయం చూపించగలిగితే వరి సాగు నుండి రైతులు బయటకు వస్తారన్నారు. వ్యవసాయరంగంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం భేటీ అయింది. భేటీలో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాలకు సరిపడా పండ్లు, కూరగాయలు పండించడం లేదన్నారు. చిన్న కమతాలలో కూరగాయల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి చోటా రైతులతో ప్రత్యేక పంటలు సాగు చేయించాలని ఏఈఓలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. చెరుకు సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. గతంలో దిగుబడి సరిగ్గా లేక రైతులు నష్టపోయారు. కానీ ఇప్పుడు 60 నుండి 100 టన్నుల దిగుబడినిచ్చే చెరుకు వంగడాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందన్నారు. సాగునీటి రాక, మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. వాణిజ్య పంటల సాగు వైపు రైతులను మళ్లించాలన్నారు. సాగునీటి రాక, ఉచిత కరెటుతో రైతులు ఆర్థికంగా లాభాన్నిచ్చే పంటల సాగుకు మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయరంగానికి ఆదరణ పెరిగిందన్నారు.
సమావేశానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయరంగం మీద ముఖ్యమంత్రి కేసీఆర్కు అభిమానం ఎక్కువన్నారు. మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుతోనే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూల సాగు తగ్గిందని, మార్కెటింగ్ సమస్యలే దీనికి కారణం అన్నారు. ఆర్గానిక్ సాగు వైపు ప్రోత్సహిస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
భేటీలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ, సహకార రంగాలు కవల పిల్లలలాంటివన్నారు. మహారాష్ట్రలో 1980ల లోనే సహకార రంగం ద్వారా రైతులు సమిష్టిగా వ్యవసాయం చేయడం, పరిశ్రమలను నిర్వహించడం జరిగిందన్నారు. అధికారులు, శాస్త్రవేత్తలు రైతులను పంటల మార్పిడి వైపు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. రైతువేదికల ఏర్పాటు, యువ ఏఈఓలు అందుబాటులో ఉండడం మూలంగా రైతులతో అద్భుతాలు ఆవిష్కరించవచ్చని పేర్కొన్నారు.