Supreme Court | తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ మైనర్ బాలిక దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనున్నది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు జాబితా చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టనున్నది. సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషన్పై విచారణ చేపట్టింది. లైంగిక దాడికి గురైన 14 సంవత్సరాల బాలికకు వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో మైనర్ బాలిక తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గర్భం తొలగించేందుకు చాలా సమయం ఆలస్యం కావడంతో కోర్టుకు అనుమతి నిరాకరించింది. తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ బాధితురాలు పంపిన ఈ-మెయిల్ను శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం దృష్టికి వచ్చింది. అదే రోజు కేసు అత్యవసర విచారణ ప్రారంభమైంది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భాటి కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోర్టు బాధితురాలి శారీరక, మానసిక పరిస్థితికి సంబంధించి నివేదిక ఇవ్వాలని ముంబయిలోని సియోన్ ఆస్పత్రిని ధర్మాసనం కోరింది. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి.. నివేదికను ఈ నెల 22న కోర్టు ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. తాజాగా ఈ అంశంపై సోమవారం ఉదయం 10.30 గంటలకు విచారణ జరుపనున్నది. పిటిషనర్ మైనర్ కాగా.. 28 వారాల గర్భిణి. ప్రస్తుతం ముంబయిలో ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎతలిపారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం.. వివాహిత మహిళలకు, ప్రత్యేక వర్గాలకు గర్భం తొలగించేందుకు గరిష్ఠ పరిమితి 24 వారాలు.