Harish Rao | రైతులు అధైర్యపడొద్దని.. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను తక్కువ ధరకు అమ్ముకోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గం పెద్ద కోడూర్ గ్రామ పరిధిలోని మెట్టుబండల వద్ద కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రూ.2,203 మద్దతు ధర ఇప్పిస్తానని.. తక్కువ ధరకు అమ్ముకోవద్దన్నారు. అధికారులతో మాట్లాడి అండగా ఉంటానన్నారు. రైతులు అధైర్య పడొద్దన్నారు.
అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, డీఎం సివిల్ సప్లయ్ ఐకేపీ అధికారులతో మాట్లాడారు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 15 రోజుల నుండి వడ్లు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 15 రోజులుగా కేంద్రంలో ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదని.. వర్షంతో ధాన్యం తడిచిందని హరీశ్రావు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొని రైతులను ఆదుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని.. రైతుబంధు పడడం లేదని ఆరోపించారు.