కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజైన శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను ఆర్డీఓ కార్యాలయంలో సమర్పించారు. ఆయన వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వెళ్లారు. కాగా ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాలో, ఇల్లందకుంటలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నేరుగా హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న గెల్లు శ్రీనివాస్.. ఆయన తల్లిదండ్రులు లక్ష్మి, మల్లయ్యల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ దాఖలకు వెళ్లారు.
నామినేషన్ దాఖలు తర్వాత మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఉద్యమ బిడ్డగా గుర్తించి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ఆయన ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేశానని అన్నారు. హుజూరాబాద్ ప్రజలు తనని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
వెన్నుపోటుదారులకు గుణపాఠం చెప్పాలి : బి.వినోద్కుమార్
గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ స్థానిక మీడియా సెంటర్లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో అవకాశాలు కల్పించినా కేసీఆర్కు వెన్ను పోటు పొడవాలని, కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేయాలని చూసిన ఈటల రాజేందర్కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ ఈ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్నే బలపరుస్తున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి, ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ దేశ వ్యాప్తంగా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని, బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని హుజూరాబాద్ ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. అసలు ఈటల రాజేందర్ బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఇప్పటికి సమాధానం చెప్పలేదని అన్నారు. ఆత్మగౌరం అని తరుచూ మాట్లాడుతున్న ఈటలకు అసలు ఆత్మగౌరవం అంటే ఏమిటో అర్థం తెలుసా? అని అడిగారు.
కేసీఆర్ బొమ్మే గెల్లును గెలిపిస్తుంది : మంత్రి గంగుల కమలాకర్
గతంలో మేమంతా కేసీఆర్ బొమ్మపైనే గెలిచామని, ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ను కూడా కేసీఆర్ బొమ్మనే గెలిపిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ను కేసీఆర్ ఆశీర్వదించి పంపించారని అన్నారు. గెల్లు శ్రీనివాస్ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని, పదవులు ఇవ్వకున్నా నిస్వార్ధంగా సేవలు అందించారని, ఇలాంటి నాయకున్ని గెలిపించుకునేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
అభివృద్ధి చేయని అసమర్ధుడు ఈటల : మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
తనను నమ్మి అవకాశం ఇచ్చిన కేసీఆర్కు ఈటల రాజేందర్ వెన్ను పోటు పొడిచే ప్రయత్నం చేశాడని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా హుజూరాబాద్ను అభివృద్ధి చేయలేక పోయాడని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో రెండు నెలల్లో మంత్రి హరీష్ రావు చేసి చూపించారని అన్నారు. సాదారణంగా నాయకులు ఎవరైనా ప్రజల సమస్యలపై పదవులకు రాజీనామాలు చేస్తారని, కానీ ఈటల రాజేందర్ ఏ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీనామా చేశారో చెప్పాలని అన్నారు. ఆస్తులు ఎక్కువై, సంపాదన పెరిగిపోయి ఆయనలో సీఎం కావాలనే కోరికలు పుట్టాయని అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని కాదని, ఎంతో ప్రోత్సహించిన సీఎం కేసీఆర్కు గోరీ కడతామని అవాకులు, చెవాకులు పలుకుతున్నాడని అన్నారు. అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా, అభివృద్ధి చేయని అసమర్ధుడు ఈటల రాజేందర్అని, అతనికి ఓట్లు వేస్తే జూరాబాద్ అభివృద్ధికి మరింత దూరం అవుతుందని అన్నారు.
పేదింటి బిడ్డను గెలిపించుకోవాలి : జడ్పీ అధ్యక్షురాలు విజయ
గెల్లు శ్రీనివాస్ను ఉద్యమకారుడిగా గుర్తించి సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టికెట్ ఇచ్చారని జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ అన్నారు. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ను గెలిపించుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ ఏదో ఒక లబ్ధి చేకూరే విధంగా పథకాలు రూపొందిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకులా ఉండి పేదలను ఆదుకుంటున్నారని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు ఇది దోహదపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.