KTR | చేవెళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్లలో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం ఖాయమైందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నంది నగర్లోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డపైన మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో పాటు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని తెలిపారు.
30 సంవత్సరాల పాటు బడుగు, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్కు ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యం అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ గ్రామీణ ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగారని.. సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకుడు అని కొనియాడారు. కాసాని రంగారెడ్డి జిల్లా స్థానికుడు అని, ఆయనకు ఇక్కడి ప్రజల కష్టసుఖాలు, అన్ని ప్రాంతాలపైన సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం ఖాయమైందని అన్నారు. ఈ దిశగా అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అనుభవించి, పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసి వెళ్లిన రంజిత్ రెడ్డితో పాటు మహేందర్ రెడ్డి వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వీళ్లకు ఏం తక్కువ చేశారని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఒక పార్టీ పట్ల నిబద్ధత లేని నాయకులను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. అధికారం కోసం జెండాలు మార్చే వాళ్లను ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు.