Harish Rao | మెదక్లో జరిగిన అభివృద్ధి తెలియాలంటే కళ్లు పెద్దవి చేసి చూడాలని రేవంత్ రెడ్డికి హరీశ్రావు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కేవలం గజ్వేల్, మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి.. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధే కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్లో శనివారం సాయంత్రం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. మెదక్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కౌంటర్ వేశారు. మెదక్కు ఇందిరాగాంధీ ఏం చేసిందని ప్రశ్నించారు. మెదక్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది.. రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని.. మూడు యూనివర్సిటీలు తీసుకొచ్చారని చెప్పారు.
ఇవాళ మెదక్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నాడని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో తెలియాలంటే కళ్లు పెద్దవి చేసి చూడమని.. లేకపోతే నువ్వొస్తే నేనే చూపిస్తానంటూ రేవంత్ రెడ్డికి హరీశ్రావు సూచించారు. మెదక్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానంటున్న నువ్వు మా జిల్లా గురించి మాట్లాడుతావా? అని మండిపడ్డారు. సింగూరు జలాలు మెదక్ జిల్లాను తాకాయంటే అది కేసీఆర్ చలవే అని తెలిపారు. ఉమ్మడి పాలనలో మెదక్ సింగూరు నీళ్లు తరలించుకుపోలేదా? అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో విలువలు ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి పదవిపై గౌరవంతో నీ ఎత్తు గురించి మాట్లాడటం లేదని హరీశ్రావు అన్నారు. కానీ నీకు నీ భాషలోనే మాట్లాడితేనే అర్థం అవుతుందని విమర్శించారు. మాటిమాటికి దూలమోలే పెరిగావ్ అంటున్నావ్.. భూమికి జానెడు ఉన్న నీకు ఆవగింజంత మెదడు కూడా దేవుడు ఇవ్వలేదు అని నేను అనాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పదవిలో ఉండి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పాత రాతియుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూడు రేవంత్.. మెదక్కు కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని హరీశ్రావు సూచించారు.
మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని హరీశ్రావు గుర్తు చేశారు. రైలు సౌకర్యం కల్పించాలంటే పెడచెవిన పెట్టారని తెలిపారు. సింగూరు జలాలు మెదక్ రైతులకే ఇవ్వాలనే డిమాండ్పై ధ్యాస పెట్టలేదన్నారు. ఇవన్నీ చేసింది కేసీఆర్ కాకపోతే మీ అయ్య వచ్చి చేశాడా అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆరోగ్యం బాగోలేకపోయినా కేసీఆర్ రైతులను పరామర్శిస్తుంటే రేవంత్ రెడ్డి తాపీగా క్రికెట్ చూస్తున్నాడని విమర్శించారు. పాలన చేతగాక, నా ప్రశ్నలకు జవాబు చెప్పడం చేతగాక బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన ఆ మహానేతపై ఇష్టమొచ్చినట్టు మొరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోదీతో రేవంత్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు. అందుకే మోదీ, కేసీఆర్ ఒక్కటయ్యారని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. బెయిల్ మీద ఉన్న ఓటుకు నోటు దొంగ రేవంత్ నీతులు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఎద్దేవా చేశారు.