మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 20 : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేసి గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. శనివారం హాజీపూర్ మండలం దొనబండ, బుద్ధిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ సర్కారులో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. దొనబండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.
రైతుబంధు డబ్బులు పడలేదని పలువురు రైతులు ఆయన ముందు కంటతడి పెట్టుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తానంటే నమ్మి కాంగ్రెస్కు ఓట్లు వేశామని, ఆ పార్టీ ఇంతలా మోసం చేస్తుందనుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో సమస్యలతో సతమతమవుతున్నారని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, నాలుగు నెలలకే ఆ పార్టీ వైఖరేమిటో ప్రజలకు అర్థమైపోయిందని పేరొ న్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ రైతులు నీళ్లు, కరంట్ కోసం ఆందోళన చేసింది లేదని గుర్తు చేశారు. అన్ని వర్గాలను కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు జాడి సత్యం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, సర్పంచులు ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, నాయకులు బెతు రవి పాల్గొన్నారు.