Harish Rao | అసెంబ్లీ ఎన్నికలప్పుడు పిట్టల దొరలా మాట్లాడినట్టే.. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడి ప్రజలను మభ్యపెట్టాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. రేవంత్ మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్రజలకు అర్థమయ్యాయని.. రేవంత్ ఎన్ని కట్టుకథలు, పిట్టకథలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. గజ్వేల్లో శనివారం సాయంత్రం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. మెదక్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కౌంటర్ వేశారు. బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది రేవంతే అని హరీశ్రావు విమర్శించారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు లాంటిది ఎవరైనా ఇస్తే అది కచ్చితంగా రేవంత్కే వస్తుందని ఎద్దేవా చేశారు.
కారును ఇనుప సామాను కింద అమ్మడం కాదు.. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడటం ఖాయమని హరీశ్రావు అన్నారు. రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో.. పార్టీ మారడం తప్పు అని అన్నాడు.. రేవంత్ మా ఎమ్మెల్యేలకు కండువాలు కప్పితే ఫిరాయింపులపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన కఠిన చట్టం హామీని ఉల్లంఘించినట్టే కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మిగతా హామీలపై కూడా చిత్తశుద్ధి లేదని అన్నారు. రైతు రుణమాఫీపై ఇప్పటికే అనేక తేదీలు చెప్పిన రేవంత్.. దేవుళ్ల మీద ప్రమాణం చేసి నయా నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. ఆగస్టు 15 న రుణ మాఫీ జరుగుతుందని రైతులు విశ్వసించడం లేదన్నారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి మాట తప్పిన రేవంత్కి మోసం కొత్త కాదన్నారు. మోసం అతని నైజం అని విమర్శించారు.
బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో గానీ ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్సే అని ఆయన స్పష్టం చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్కు లేదని విమర్శించారు. రాష్ట్రంలో మాదిగలకు తీరని ద్రోహం చేశావని మీ పార్టీ నాయకుడు మోతుకుపల్లి నిరాహార దీక్ష చేస్తున్నడు.. దీన్ని బట్టే రేవంత్ చేసే సామాజిక న్యాయం ఏమిటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీసీల, మాదిగల ద్రోహి రేవంత్కు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని అన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
మా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గురించి రేవంత్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని.. మెదక్లో లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చింది మా వెంకట్రామిరెడ్డి అని హరీశ్రావు అన్నారు. నువ్వు ఈరోజు హైదరాబాద్కు ఆగమేఘాల మీద నీళ్లు తీసుకొనిపోయావంటే అది మా వెంకట్రామిరెడ్డి చేసిన కృషి వల్లే అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల భూములకు పరిహారం ఇచ్చింది వెంకట్రామిరెడ్డి అని తెలిపారు. ఇంతకంటే ఉత్తమమైన పునరావాస కాలనీ దేశంలో ఎక్కుడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన మేలు రేవంత్ రెడ్డికి కనిపిస్తలేదని అన్నారు. నాలుగు జిల్లాల దాహార్తి తీర్చిన గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణంలో వెంకట్రామిరెడ్డి పాలుపంచుకున్నారని తెలిపారు. వెంకట్రామిరెడ్డి మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఓటరే అని ఆయన తెలిపారు. కొడంగల్లో చిత్తుగా ఓడిన నువ్వు మల్కాజిగిరికి, రాహుల్ గాంధీ వయనాడ్కి వెళ్లలేదా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి గాలిమాటలు, పిల్లి శాపాలు బంద్ చేస్తే మంచిదని హితవు పలికారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని, అవాకులు చవాకులు బంద్ చేయాలని సూచించారు. తొక్కుకుంటా వచ్చిన అంటున్నవు.. అవును టీడీపీలో ఉన్న నాయకులను తొక్కినవు, కాంగ్రెస్లోని నిజమైన కాంగ్రెస్ నాయకులను తొక్కినవు అని విమర్శించారు. ‘ప్రజాపాలనలో ప్రజలను కలవడం లేదు. మీ సొంత పార్టీ నాయకులు హన్మంతరావుకు, మోత్కుపల్లికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. రైతుల కష్టాలు పట్టడం లేదు. తడిచిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు.. మంత్రులు, కలెక్టర్లు రారు.’ అని అన్నారు. దెబ్బతిన్న మొక్కజొన్న, మామిడి పంటల రైతులకు ఎకరాకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లను మద్దతు ధరకు కొనడం లేదని.. కేంద్రాల్లో రైతులు ఎండకు ఇబ్బంది పడుతున్నారు. రైతులపై మీకెందుకు ఇంత పగ అని ప్రశ్నించారు. మెదక్ గడ్డ గులాబీ జెండా అడ్డా అని.. 2004 నుంచి ఇక్కడ గెలుస్తున్న బీఆర్ఎస్ మళ్లీ గెలవబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.