Harish Rao | రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరుగడం బాధాకరమన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48గంటలు కూడా కాలేదన్నారు.
చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణమన్నారు.
మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమన్నారు. వనస్థలీపురం పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్పై సామూహిక లైంగిక దాడి, ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, నల్గొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై లైంగిక దాడి, నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్ బస్సులో మహిళపై డ్రైవర్ లైంగిక దాడి ఘటనలు జరిగాయన్నారు. బాధితులకు భరోసా కల్పించాలని.. నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.