Telangana Assembly | హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీని ముట్టడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు తక్షణమే మినిమం టైం స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు వరంగల్ వేదికగా తమకు న్యాయం చేస్తామని, బేసిక్ పే అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని, ఇంతవరకు హామీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు మల్లేశం మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసే దాకా ప్రభుత్వంపై నిరసన తెలుపుతామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడుతామని స్పష్టం చేశారు.