హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి దవాఖానల్లో నాలుగు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రూ.2 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. దీనితోపాటు కొవిడ్ సెంటర్లకు అవసరమైన వెంటిలేటర్లు, అత్యవసర సేవల వైద్య పరికరాల కొనుగోలుకు రూ.3.15 కోట్లను మంజూరుచేశారు. వెంటనే కావాల్సిన వైద్య పరికరాలు కొనుగోలుచేసి, ఆయా దవాఖానలకు సరఫరా చేయాలని సీఎండీ ఆదేశించారు. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా కొవిడ్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లలో ఆక్సిజన్ కొరత లేనప్పటికీ.. భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆక్సిజన్ కొరత రాకుండా సొంతంగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన దవాఖాన, భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్, మంచిర్యాలలోని రామకృష్ణాపూర్ సింగరేణి దవాఖాన, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా దవాఖానల్లో ఏర్పాటుచేయనున్నారు. ఐదారు వారాల్లో వీటి నిర్మాణం పూర్తిచేయాలని ఆర్డర్ పొందిన నిర్మాణ సంస్థలను సీఎండీ ఆదేశించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు గంటకు 12 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. దీనితోపాటు రామగుండం ఏరియా దవాఖానలో ఏర్పాటుచేసే మరో పెద్ద ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ చివరి దశకు చేరుకొన్నది. ఈ ప్లాంట్ నుంచి రోజుకు 80 నుంచి వంద సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దీని నిర్మాణం కూడా ఆరు వారాల్లో పూర్తవుతుంది. కొవిడ్ సమయంలో విద్యుత్ సంస్థలకు బొగ్గు కొరత రాకుండా కార్మికులు తగు జాగ్రత్తలతో ఉత్పత్తిచేస్తున్నారని, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని అన్ని విద్యుత్ సంస్థలకు 2-4 వారాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా రవాణాచేస్తున్నట్టు వివరించారు.