Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు దేశ విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2024లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను హరీశ్రావు ఎండగట్టారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా.. వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా తీయలేదు అని హరీశ్రావు విమర్శించారు.
అభయ హస్తం ప్రజలను భయ పెట్టే, భాధ పెట్టే హస్తంగా మారింది. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 390 రోజులు గడిచినా మొదలు కాలేదు. గ్యారంటీలు అమలు చేయమంటే గారడీల విన్యాసం చేస్తున్నారు. ఏడాది పాలన తర్వాత అనేక సర్వే ఏజెన్సీలు ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నాలు చేశాయి. ఏ సర్వేలో కూడా రేవంత్కు పాస్ మార్కులు కూడా రాలేదు. ఎవరిని అడిగినా రేవంత్ను తిడుతున్నరు అనే సమాధానం వస్తోంది. డిక్లరేషన్లు అమలు చేసే బదులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే పగబడుతున్నారు.. పాలసీ ఏదీ అంటే పోలీసులను పంపుతున్నారు. కిట్ల స్థానంలో కాంగ్రెస్ మార్కు తిట్లు వచ్చాయ్ అని హరీశ్రావు మండిపడ్డారు.
ఎన్నికలప్పుడు బోనస్ మాటలు.. ఇప్పుడేమో బోగస్ మాటలు. ఎన్నికలప్పుడు అన్ని పంటలకు బోనస్ అన్నారు – ఇప్పుడు ఒక పంటకు మాత్రమే అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి. రుణమాఫీ చివర విడత చెక్కు అని హంగామా చేశారు.. ఇంకా డబ్బులు రైతుల అకౌంట్లలోనే జమ కాలేదు. వరంగల్లో మహిళా సంఘాలకు ఇచ్చిన చెక్కుల డబ్బులు కూడా వారికి చేరలేదు. విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు కూడా అమలు కాలేదని హరీశ్రావు గుర్తు చేశారు.
బీఆర్ఎస్ నాయకులపై క్షణాల్లో కేసులు పెడుతున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదుచేస్తే పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ నేతలు చెప్పిందే పోలీసులు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల మీద ధ్యాసే తప్ప కమిట్మెంట్ లేదు. కేసీఆర్ గొప్పగా నెలకొల్పిన గురుకులాలను గాలికి వొదిలేశారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. సీఎంకు ఢిల్లీ పర్యటనల ధ్యాసే తప్ప.. గల్లీల్లో ఉన్న గురుకులాల మీద పట్టింపు లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉత్తవే అయ్యాయి. 2 లక్షల ఉద్యోగాలు అని 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వక్ర మార్గం పట్టిస్తున్నారు అని హరీశ్రావు మండిపడ్డారు.
అయితే లాఠీ.. లేకపోతే లూటీ అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అప్పులపై అబద్దాలే.. హామీల అమలుపై అబద్దాలే. అసెంబ్లీలో కూడా అడ్డు అదుపు లేకుండా అబద్దాలు చెబుతున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం పోయి అనుముల రాజ్యాంగం వచ్చింది. రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర పనులు శృతి మించుతున్నాయ్. హైడ్రా పేరిట సామాన్యులకు నిద్ర లేకుండా చేశారు.. హైదరాబాద్ ఇమేజీని డామేజ్ చేశారు అని మాజీ మంత్రి నిప్పులు చెరిగారు.
రైతుబంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు రాత్రి పగలు కష్టపడుతున్నారు. ప్రజల బ్రతుకులు మార్చుతామని నమ్మించి గద్దెనెక్కి తెలంగాణ తల్లిని మార్చాడు. పోలీస్ లోగో మాత్రం మారింది. TS నుండి TGగా మారింది. ఇప్పుడు రాష్ట్ర లోగో కూడా మార్చుతామని అంటున్నారు. అయితే, ప్రజల బ్రతుకులు మాత్రం మారలేదు. తెలంగాణ తల్లి విగ్రహం మారితే రేవంత్ తప్పులు ఒప్పులు అయితాయా. చివరకు ఫిరాయింపులపై కూడా రేవంత్ తన మాటను ఫిరాయించేశాడు. అవకాశ వాదానికి రేవంత్ మరో పేరుగా మారాడు అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, బీజేపీల స్నేహం ఏడాదిలో మరింత బలపడింది. కాళేశ్వరం చిన్న రిపేర్ను కూడా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. లగచర్లలో సీఎం భూ దందా బయట పడింది. అమాయకులను అన్యాయంగా అరెస్టు చేశారు. అది మెట్రో అయినా ఫార్మా ప్రాజెక్టు అయినా ప్రభుత్వానికి ఏ విజన్ లేదు. అప్పులు అగాధంగా పెరిగాయి.. అభివృద్ధి అదో పాతాళానికి వెళ్ళింది. ఏడాదిలోనే కాంగ్రెస్ కాలకేయ అవతారం, రేవంత్ రావణాసుర రూపం బయట పడ్డాయి. ప్రజలు ఏం కోల్పోయామో గ్రహిస్తున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచడం వల్లే ప్రజలకు మేలు జరుగుతోంది. ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది. ఆరు గ్యారంటీలతోపాటు, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 420 అంశాలను అమలు చేయండి. రాజకీయ కక్షలు మానండి – రాష్ట్రం అభివృద్ధి కక్ష్యలో పరిభ్రమించేట్టుగా పాలన సాగించండి అని రేవంత్ సర్కార్కు హరీశ్రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Prabhas | డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. న్యూ ఇయర్ వేళ ప్రభాస్ వీడియో మెసేజ్!