Harish Rao | ఖమ్మం : ఒక రైతుకైనా సన్నరకం వడ్లకు బోనస్ వచ్చిందా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అడిగారు. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైందని హరీశ్రావు తెలిపారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఖమ్మం పత్తి మార్కెట్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
శంకర్, రమాదేవి అనే రైతులు 8 ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం 5 క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.
రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు. మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్రావు మండిపడ్డారు.
రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వమని మోసం చేశారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని మోసం చేశారు. రూ.12,000 రైతు కూలీలకు ఇస్తామని మోసం చేశారు. రూ.500 బోనస్ ఇస్తామని కూడా మోసం చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాడడమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరగం వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని హరీశ్రావు తెలిపారు.
ముఖ్యమంత్రి మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు, కానీ పత్తి వరి కొనుగోళ్లపై సమీక్ష చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికి మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పత్తిని రూ.7,500కు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు : హరీశ్ రావు
Future City | ప్రాణాలు పోయినా భూములివ్వం.. కందుకూరు, కొడంగల్లో తిరగబడ్డ రైతులు
Nagarkurnool | ఐకేపీ సెంటర్లో వడ్ల లారీ మాయం.. బ్లాక్ లిస్టులో పెట్టిన రైస్ మిల్లులో ప్రత్యక్షం