హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు పరిష్కారవేదికగా మారింది. ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 6.5 లక్షల భూ లావాదేవీలు జరిగాయి. ఇందులో అన్నిరకాల రిజిస్ట్రేషన్లు కలిపి 4.54 లక్షలు, 16,215 నాలా కన్వర్షన్లు జరిగాయి. మరో రెండు లక్షల వరకు పెండింగ్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతుల ఇబ్బందులను తీర్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ను ప్రవేశపెట్టడంతో ధరణి ఒక పరిష్కార వేదికగా మారింది. కొన్ని సమస్యలపై రైతులే స్వయంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా, మరికొన్నింటిని మీసేవ కేంద్రం ద్వారా వినతులు పంపేలా ఆప్షన్లు ఇచ్చారు. వీటి బాధ్యత కలెక్టర్లకు అప్పగించడంతో సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి. మండలస్థాయిలో రోజువారీగా ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారు? పెండింగ్లో ఉన్నవి ఎన్ని? వంటి వివరాలన్నీ ఉన్నతాధికారులకు కనిపిస్తున్నాయి. వారు వెంటనే ఫోన్చేసి వివరాలు అడుగుతున్నారు. పెద్దగా వివాదాలు లేని భూముల దరఖాస్తులను గరిష్ఠంగా రెండువారాల్లోనే పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
లక్షన్నర మందికి అందిన రైతుబంధు
ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటివరకు సుమారు 2 లక్షల సమస్యలు పరిష్కారం కాగా.. వీరిలో సుమారు లక్షన్నర మందికి రైతుబంధు సాయం అందినట్టు సమాచారం. పెండింగ్ సమస్యలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 1.3 లక్షల పెండింగ్ మ్యుటేషన్లను పూర్తిచేశారు. ఇతర భూ సమస్యల్లో 45 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ధరణి పోర్టల్ గతేడాది నవంబర్ 2న ప్రారంభం కాగా, భూ సమస్యలపై వినతులకు ఈ ఏడాది ప్రారంభం నుంచి అవకాశం కల్పించారు. రైతుబంధుకు ఈ ఏడాది జనవరి1 నుంచి జూన్ 10వ తేదీ వరకు కటాఫ్గా నిర్ణయించారు. కాబట్టి ధరణి ద్వారా లబ్ధి పొందినవారిలో అత్యధిక శాతం మందికి ఈ దఫా రైతుబంధు సాయం అందినట్టు అధికారులు తెలిపారు.అందువల్లనే గతేడాదితో పోల్చితే ఈసారి రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 3 లక్షల వరకు పెరిగినట్టు వెల్లడించారు.