చేర్యాల, జూలై 28 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) భక్తులతో సందడిగా మారింది. ఆదివారం భక్తులు( Devotees) పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని సుమారు 5 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.