Ludhiana | లూధియానా: పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో ఉన్న ఓ పిజ్జా (Pizza) దుకాణంలో కాల్పుల ఘటన భయాందోళన కలిగించింది. అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని దుండగులు పిజ్జా దుకాణంలోకి వచ్చి మూడు సెకన్లలో మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దాలు ఉలిక్కిపాటుకు గురిచేశాయి. లూధియానాలోని విలాసవంతమైన ప్రాంతం అయిన భాయ్ రణధీర్ సింగ్ నగర్లో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దుండగులు కాల్పులు జరిపిన తరువాత దుకాణంలోని సిబ్బంది, కస్టమర్లు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు తామే బాధ్యులం అని పేర్కొంటూ ‘గోపి లహోరియా గ్రూప్’ ఇన్స్టా (Insta) ఖాతాలో ఓ మెసేజ్ను పోస్ట్ చేశారు. బెదిరింపు ధోరణిలో ఆ పోస్ట్ ఉండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇన్స్టా ఖాతాకు ఏదైనా గ్యాంగ్తో సంబంధం ఉందా, లేదా భయాన్ని వ్యాప్తి చేయడానికి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీ, సోషల్ మీడియా పోస్ట్ను పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.