హైదరాబాద్: రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. నకిలీ విత్తనాలను నిల్వ ఉంచిన గోదాములపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై గత నాలుగేండ్లలో 10 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేశామన్నారు. నగర శివార్లలోని హయత్నగర్, వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. రూ.1.15 కోట్ల విలువైన నకిలీ పత్తి, మిరప విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు.. హయత్నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాల షాపులపై దాడులు చేశామని.. హయత్నగర్లోని పసుమాములలో రూ.60 లక్షల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేశామని వెల్లడించారు.
పత్తి, మిర్చి, వేరుశెనగ విత్తనాల గడువు ముగిసినప్పటికీ, మళ్లీ ప్యాక్చేసి వాటిని అమ్ముతున్నారని చెప్పారు. అలాంటివారిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పారు. నకిలీల విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.