ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 24: ఉస్మానియా యూనివర్సిటీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ‘ఉస్మానియా తక్ష్ – 2024’(Osmania Taksh – 2024) బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను ముందస్తుగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి సెంటెనరీ పైలాన్ వరకు 2కే వాక్(2k Walk) నిర్వహించారు. ఈ వాక్కు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
25న వర్సిటీలోని అన్ని విభాగాలలో ఓపెన్ హౌజ్ కార్యక్రమాలతో పాటు వివిధ రకాల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
26న ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం పదిన్నర గంటలకు జరుగనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్, గౌరవ అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, అమెరికాలోని ఇమేజియా కార్పొరేషన్ ఫౌండర్, సీఈవో వీణ గుండవెళ్లి హాజరుకానున్నారని వివరించారు.
మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జయరాజు హాజరవుతారని చెప్పారు. ఈ వేడుకలకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. పైలాన్ వద్ద విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి.