బంజారాహిల్స్.ఏప్రిల్ 24 : మితిమీరిన వేగంతో కారు నడిపిస్తూ ర్యాష్ డ్రైవింగ్కు(Rash driving) పాల్పడుతున్న యువకుడిపై జూబ్లీహిల్స్(Jubilee Hills) పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు ఓ పోర్షే కారు( టీఎన్ 07సీడీ 9292) అత్యంత ప్రమాదకరంగా దూసుకువెళ్లింది. భారీ శబ్దంతో రేసింగ్ను తలపిస్తూ కారు దూసుకువెళ్తుండడంతో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు ఉలిక్కి పడ్డారు.
కాగా, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తమయి కారును ఆపారు. కారు నడిపిస్తున్న యువకుడిని ప్రశ్నించగా లైసెన్స్ లేదని తేలింది. చెన్నైకి చెందిన నిర్మల్ కృష్ణన్ పేరుతో కారు ఉన్నట్లు గుర్తించారు. కారు నడిపిస్తున్న యువకుడు కూకట్ పల్లి సమీపంలోని కలశ్ హిల్స్కు చెందిన దాడి జగన్(19)పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.