విజేతలకు ఒకే డోస్ వ్యాక్సిన్ ఇస్తే కరోనా విజృంభణ, ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత, వ్యాక్సిన్ల కొరత.. ఇలా ఎన్నో ప్రతికూలతల మధ్య ఆశ చిగురించే విషయాన్ని చెప్పారు శాస్త్రవేత్తలు. కరోనా వచ్చిపోయినవాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందని వెల్లడించారు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ వ్యూహాన్ని మార్చేసి, ఒక్క డోస్తోనే సరిపెడుతున్నాయి. దీనిపై మనదేశంలోనూ రిసెర్చ్ జరిగి, ఇవే ఫలితాలు వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా శుభవార్త ఇంకోటి ఉండదు.
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిపోయిందా? అయితే మీకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుంది. విదేశీ శాస్త్రవేత్తలు చేసిన పలు అధ్యయనాల్లో ఇదే తేలింది. వైరస్ను జయించినవాళ్ల శరీరంలో యాంటిబాడీలు చురుకుగా పనిచేస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యాక అమెరికాలో అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. కరోనా సోకిన, సోకనివాళ్లపై టీకాల ప్రభావాన్ని అమెరికాలోని పెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అధ్యయనం చేసింది. వాటి వివరాలను గత వారం సైన్స్ ఇమ్యూనాలజీ మ్యాగజైన్లో ప్రచురించారు. దీని ప్రకారం.. అమెరికాలో కరోనాను జయించినవారికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన తర్వాత యాంటిబాడీల రెస్పాన్స్ చాలా బాగా ఉన్నది. రెండో డోస్ తర్వాత పెద్దగా మార్పులేదు. కరోనా సోకనివారికి రెండో డోస్ ఇచ్చినా కొన్ని రోజులవరకు యాంటిబాడీల ప్రభావం కనిపించలేదు. ఇటలీ, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోనూ ఇలాంటి అధ్యయనాలే జరిగాయి. సియోటెల్లోని ఫ్రెడ్ హచిసన్ క్యాన్సర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 10 మందిపై పరిశోధనలు చేయగా కరోనా వచ్చిపోయిన వాళ్లలో రెండో డోస్ తర్వాత పెద్ద మార్పులేమీ కన్పించలేదట. మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చాక వారి శరీరంలో యాంటిబాడీలు కొన్ని వేల రెట్లు పెరగ్గా, రెండో డోస్ ఇచ్చాక యాంటిబాడీలు ఆ స్థాయి లో పెరగలేదని న్యూయా ర్క్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. మిగిలిన అధ్యయనాలు కూడా పరిశీలించాక కరోనా వచ్చిపోయిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ ఇస్తే చాలని నిర్ధారణకు వచ్చినట్టు న్యూయార్క్కు చెందిన మౌంట్ సినాయిలోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇమ్యూనాలజిస్టు ఫ్లోరియన్ క్రెమర్ పేర్కొన్నారు. అయితే పూర్తి డాటా లేనందున ఈ వాదనను తాత్కాలికంగా పక్కనబెడుతున్నట్టు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.
మనమూ రిసెర్చ్ చేయాల్సిందే
సెకండ్ వేవ్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న భారత్లో పరిశోధనలు చాలా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యాక్సిన్ కొరత ఉన్నందున కరోనా వచ్చిపోయిన వాళ్లలో మొదటి డోస్, రెండో డోస్ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటికే లక్షలమంది రికవర్ అయ్యారు. ఆరోగ్య శాఖ, లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఈ దిశగా అధ్యయనాలు నిర్వహిస్తే.. కోలుకున్నవారికి ఒకే డోస్ ఇవ్వడం ద్వారా మరింత ఎక్కువమందికి త్వరగా వ్యాక్సిన్ ఇచ్చే ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు.
యాంటీబాడీలు ఏం చేస్తాయి?
యాంటిబాడీల్లో మొదటిది టీ కిల్లర్ సెల్స్, రెండోది మెమొరీ బీ సెల్స్. టీ కిల్లర్స్ సెల్స్ వైరస్ను చంపే పనిచేస్తే, మెమొరీ బీ సెల్స్ భవిష్యత్తులో వైరస్ మళ్లీ విజృంభిస్తే దాన్ని పసిగట్టి ఇమ్యూన్ సిస్టమ్ను అలర్ట్ చేస్తుంది. దీంతో టీ కిల్లర్ సెల్స్ తయారై వైరస్ను చంపేస్తాయి.
ఒక్క డోసే ఇస్తున్న యూరప్ దేశాలు
కరోనాను జయించినవారికి ఒకే డోస్ సరిపోతుందన్న అధ్యయనాలతో ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు తమ వ్యాక్సినేషన్ వ్యూహాన్ని మార్చుకొని ఒకే డోస్తో సరిపెడుతున్నాయి. వైరస్ సోకి, కోలుకున్నవారికి ఒకే డోస్ ఇవ్వాలని ఇజ్రాయెల్ గత ఫిబ్రవరిలోనే నిర్ణయించి, అమలు చేస్తున్నది.
ఇవీ కూడా చదవండి…
ఆక్సిజన్ లెవల్స్కాపాడుకుందాం!