హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : డీఎన్ఏ నిర్ధారణలో వినూత్న ఆవిష్కరణ. ఐదు క్షణాల్లో డీఎన్ఏ ఫలితాన్ని వెల్లడించే వినూత్న పరిజ్ఞానాన్ని హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు ఆవిష్కరించారు. అంప్రెడీ పేరిట బయోనెస్ట్ ఇంక్యూబేషన్కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘30 ఎంఎల్ జినోమిక్స్’ ఈ వినూత్న ఆవిష్కరణ చేసింది. దీనికి ల్యాబొరేటరీలు అవసరం లేదు. ఎక్కడైనా అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో ఈ పరీక్ష చేయవచ్చు. సాధారణంగా డీఎన్ఏను వేరుపరచాలంటే.. ల్యాబ్, సరిపడా ఎక్విప్మెంట్ ఉండాలి. ఒక్కసారి శాంపిల్ తీసుకున్నాక ఫలితం నిర్ధారించేందుకు కనీసం 3 గంటల సమయం పడుతుంది. పైగా ఈ ప్రక్రియను చేపట్టే ల్యాబొరేటరీలు నగరాలకే పరిమితం.
కానీ అంప్రెడీ టెక్నాలజీలో ఎలాంటి ల్యాబ్ అవసరం లేకుండానే డీఎన్ఏ ఫలితం వెల్లడువుతంది. మనుషులు, జంతువులు, మొక్కలు, క్రిములు ఇలా అన్ని రకాల ప్రాణుల డీఎన్ఏ పరీక్షలు చేసేలా దీనిని రూపొందించారు. ముఖ్యంగా పుట్టబోయే పిల్లలు జన్యు సంబంధిత సమస్యల బారిన పడకుండా గర్భిణులకు డీఎన్ఏ పరీక్ష జరిపి వ్యాధులను వేగంగా గుర్తించడంలో ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుంది. ఈ సేవలను తక్కువ డబ్బులతోనే అందించేలా అంప్రెడీని సిద్ధం చేశామని స్టార్టప్ ఫౌండర్లు పావని, యశ్వంత్రెడ్డి, డాక్టర్ బెనెట్ దాస్లు తెలిపారు. అంప్రెడీ ఆవిష్కరణకు ప్రముఖ అధ్యయన సంస్థలు, లాబొరేటరీస్ నుంచి ప్రశంసలు దక్కాయి. అంప్రెడీ టెక్నాలజీ ప్రస్తుతం సీసీఎంబీ పరిశీలనలో ఉంది. వారు దీనికి ఆమోదం తెలిపితే కొవిడ్ టెస్ట్లు చేయడం మరింత సులభతరం కానుంది. విత్తనాలు, ఆకుల నుంచి ఆర్ఎన్ఏ సేకరించి పరీక్షలు చేయడంలో అంప్రెడీ విజయవంతమయిందని స్టార్టప్ వ్యవస్థాపకురాలు పావని తెలిపారు. కొవిడ్ టెస్ట్లు చేయడానికి అనుమతి లేనందున అంప్రెడీ టెక్నాలజీని సీసీఎంబీ పరిశీలనకు పంపామని చెప్పారు.