హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యార్థుల అభ్యసన, ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్ దశల్లో మన విద్యార్థులు ఆశించిన స్థాయిలో నేర్చుకోలేక పోతున్నారని, వారి సామర్థ్యాల్లో గణనీయమైన లోపాలున్నాయని ఆ నివేదిక పేర్కొన్నది. ‘స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా టెంపోరల్ అనాలిసిస్ అండ్ పాలసీ రోడ్మ్యాప్ ఫర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్’ పేరిట నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యాసంస్కరణలు సత్ఫలితాలను ఇవ్వడంలేదని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది. ప్రాథమిక విద్యలో పటిష్ట పునాది లేకపోవడం, గణితం, భాషలపై పట్టు లేకపోవడం, ఇతర బలహీనతలు విద్యార్థుల ప్రతిభపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫౌండేషన్ దశ (మూడో తరగతి)లో తెలంగాణ విద్యార్థుల్లో కేవలం 58% మందిలో మాత్రమే భాషా నైపుణ్యాలు, 54% మందిలో మాత్రమే గణిత నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. జాతీయ సగటు భాషల్లో 64%, గణితంలో 60 శాతంగా ఉన్నది. రోజువారీ సంభాషణకు అవసరమైన పదజాలాన్ని ఉపయోగించడం, చిన్నకథలు రాయడం, వార్తలు చదివి అర్థం చేసుకోవడం లాంటి భాషా నైపుణ్యాలను పరీక్షించడంతో ఈ ఫలితాలు వచ్చాయి. గణితంలో 99 వరకు సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చడం, సులభమైన కూడికలు, తీసివేతలు, నమూనాలను గుర్తించడం లాంటి సామర్థ్యాలను పరీక్షించగా.. ప్రతి 100 మందిలో 46 మంది వెనుకబడ్డారు. భాష, గణితంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ర్టాలు 75% సామర్థ్యంతో అగ్రస్థానంలో నిలిచాయి. తెలంగాణతోపాటు మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్ రాష్ర్టాల విద్యార్థుల్లో లెర్నింగ్ గ్యాప్స్ ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రిపరేటరీ దశ (ఆరో తరగతి)లో తెలంగాణ విద్యార్థుల భాషా సామర్థ్యం 5ఠ3%, గణిత సామర్థ్య 44 శాతంగా నమోదైంది. భాషల్లో జాతీయ సగటు 57 శాతంగా, గణితంలో 46 శాతంగా ఉన్నది. ఈ విషయంలో తెలంగాణతోపాటు తమిళనాడు, ఉత్తరాఖండ్, నాగాలాండ్ రాష్ర్టాల విద్యార్థులు జాతీయ సగటు కంటే తక్కువ ప్రదర్శన కనబర్చారు.
మిడిల్ దశ (9వ తరగతి)లో తెలంగాణ విద్యార్థుల భాషా సామర్థ్యం జాతీయ సగటు (54 శాతం)తో సమానంగా ఉన్నది. గణితంలో మన విద్యార్థుల ప్రతిభా సామర్థ్యం జాతీయ సగటు (37 శాతం) కంటే తక్కువగా ఉన్నదని, సైన్స్, సోషల్సైన్స్లో తెలంగాణ విద్యార్థులు 40% సామర్థ్యంతో జాతీయ సగటు కంటే వెనుకబడ్డారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.