హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో వరంగల్ పర్యటనకు బయల్దేరనున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్థాయి సేవలను ఈ దవాఖానలో అందుబాటులోకి తేనున్నది. వరంగల్ను అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.వెయ్యి కోట్లతో ఈ దవాఖానను నిర్మించనున్నారు. హాస్పిటల్ నిర్మించేందుకు వరంగల్ సెంట్రల్ జైలును తరలించారు. 59 ఎకరాల విశాలమైన స్థలంలో కొత్త దవాఖాన నిర్మాణం జరుగనున్నది. అత్యవసర వైద్య సేవలకు అనుగుణంగా ఎయిర్ అంబులెన్స్ (హెలిక్యాప్టర్)ను వినియోగించేలా హాస్పిటల్ భవనంపై హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు.
వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. దీంతోపాటు 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సైతం సీఎం ప్రారంభించనున్నారు.