CM KCR | సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
దేవాలయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాలలో విధులు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా వేతనాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లోని గోపన్ పల్లిలో సకలసౌకర్యాలతో, కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని స్వహస్తాలతో ప్రారంభించానని గుర్తు చేశారు. ఈ భవనం భారతీయ సనాతన సంస్కృతికి వారధిగా, వైదిక గ్రంథాలయంగా, వివిధ క్రతువుల నిర్వహణకు మార్గదర్శిగా పేద బ్రాహ్మణులకు సహకార కేంద్రంగా, లోక కల్యాణకారిగా వెలుగొందాలని ఆకాంక్షించారు. విప్రహిత పేరుతో ఏర్పాటైన ఈ భవనం సకల జనహితగా, విశ్వహితగా వెలుగొందాలని ఆశిస్తున్నానని అన్నారు.
మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని తన సంజీవని వ్యాఖ్యతో ప్రపంచానికి చాటిచెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలియజేశారు. బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద/శాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఈ భృతిని పొందే అర్హత వయస్సును ప్రభుత్వం 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నదని.. రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయలకు ధూప దీప నైవేద్యం పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుందని తెలిపారు. ఇప్పటివరకు ధూపదీప నైవేద్య పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నదని.. ఈ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షల రూపాయలను ఇక నుంచీ Annual Grant గా ఇస్తామని తెలియజేస్తున్నాను. I.I.T, I.I.M లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి