CM KCR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం వివరించారు.
‘ ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యల పరంపర ఎంతగానో కలచివేసేది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టింది. చేనేత కార్మికులకు నూలు, రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 10 శాతం సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటే, తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నది. వీటితోపాటు, నేత కార్మికులకు పావలా వడ్డీకే రుణ సదుపాయం కల్పించడంతో పాటు, 2010 నుంచి 2017 వరకూ జాతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల వద్ద ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసుకున్నాం. నేత కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకొనేందుకు 2017 సంవత్సరం నుంచి బతుకమ్మ చీరెల తయారీని వారికే అప్పగిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ రూ. 1,727 కోట్లు అందించుకున్నాం.’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జల వనరులను అభివృద్ధి చేయడమే గాకుండా, రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టింది. వాటిపై హక్కులను మత్స్యకారులకే కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. చేపల పెంపకం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ప్రమాదంలో మరణించే మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా రూ. 4 లక్షలు, ప్రభుత్వం మరో రూ.5 లక్షలు, మొత్తంగా 9 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తూ అండగా నిలుస్తున్నది. ‘ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కల్లుగీత వృత్తి మీద ఆధారపడి జీవించే గౌడ సోదరుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సమైక్య రాష్ట్రంలో మూసివేయించిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు దుకాణాలను తిరిగి తెరిపించింది. దీనివల్ల వేలాదిమంది కల్లుగీత కార్మికుల ఉపాధిని నిలబెట్టింది. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చెట్ల పన్నును రద్దు చేసింది. గతంలోని పన్ను బకాయిలను సైతం మాఫీ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్ షాపుల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా గౌడ సోదరులు వ్యాపార రంగంలో బలంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కల్పించింది. మరణించిన లేదా అంగవైకల్యం చెందిన గీత కార్మికునికి సమైక్య రాష్ట్రంలో 50 వేల రూపాయల పరిహారం మాత్రమే అందేది. గౌడ సోదరుల సంక్షేమాన్ని ప్రధాన బాధ్యతగా స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం ఈ పరిహారాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి, చిత్తశుద్ధిని చాటుకున్నది. 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ప్రభుత్వం 2,016 రూపాయల పింఛన్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలోని 65,668 మంది గీత కార్మికులకు పింఛన్ల కింద ఇప్పటివరకు దాదాపు 800 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. రైతుబీమా తరహాలోనే గౌడ సోదరులకు కూడా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం అందించబోతున్నది. ఇందుకు అవసరమైన బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ‘ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
సర్వమత సమభావన పునాదిగా అన్నివర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ, ఎవరిపట్లా వివక్షా, ఉపేక్ష లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సర్వజనులకూ అందిస్తున్నది. మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. మైనారిటీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పింది. మైనారిటీ బాలికల విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ఇమామ్లకు, మౌజన్లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకం, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రభుత్వమే అధికారికంగా రంజాన్, క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ, నిరుపేద ముస్లిం మరియు క్రైస్తవ మతాల పేదలకు కొత్త బట్టలు అందిస్తున్నది. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం కొత్త చీరలు పంపిణీ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జైన మతస్తులకు మైనారిటీ హోదా కల్పించడంతో వారిలో సంతోషం నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సర్వమత సమాదరణ విధానానికి ఇది తార్కాణం.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి