నాగర్కర్నూల్, ఆగస్టు 8 : సాగునీరు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వరుస కథనాలకు.. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఎట్టకేలకు ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-1లోని ఎల్లూరు వద్ద మూడు, లిఫ్ట్-2లోని జొన్నలబొగుడ వద్ద రెండు, లిఫ్ట్-3లోని గుడిపల్లి ఎత్తిపోతల వద్ద మూడు మోటర్లు ప్రారంభమ మయ్యాయి.
గురువారం రాత్రి రెండు మోటర్లు, శుక్రవారం సాయంత్రం నుంచి మరో మోటర్ ప్రారంభించి నీటిని రిజర్వాయర్లోకి వదులుతున్నారు. ఇప్పటి వరకు మూడు మోటర్ల ద్వారా 1,250 క్యూసెక్కులురిజర్వాయర్లోకి వదులుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదే విధంగా మోటర్లను నడిపిస్తే రిజర్వాయర్లోకి పూర్తిస్థాయి నీరు చేరుకునే అవకాశం ఉన్నదని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. తమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.