KTR |నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్లో మృతదేహం లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.
కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరని కేటీఆర్ అన్నారు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని మండిపడ్డారు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత.. కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని ఎద్దేవా చేశారు.
మిషన్ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది అని విమర్శించారు. జలమే జగతికి మూలం అని గుర్తుంచుకోండి అని తెలిపారు. ఈ సర్కారు తీరు మారకపోతే… జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
Read More : Nalgonda | వాటర్ ట్యాంక్లో శవం, అదే నీళ్లను పదిరోజులుగా తాగుతున్న జనం