KTR | ఆదిలాబాద్ : ఈ రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవడానికి కూడా రెడీగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేతలను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైతన్నల ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్ నుంచి ఉదయం ఏడున్నరకు వెళ్లినం.. కానీ కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందంటే.. అన్ని పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మేడ్చల్ వద్దనే 45 నిమిషాలు పట్టింది. ఇక డిచ్పల్లి వద్ద కొందరు మహిళలు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధర్నా చేస్తున్నారు. ఏం కష్టమొచ్చింది అని దిగాను. వాళ్లు పోలీసోళ్ల భార్యలు. వన్ పోలీసింగ్ కావాలని డిచ్పల్లి బెటాలియన్ వద్ద ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్న మమ్మల్ని రక్తం కారేలా గుంజుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఆడబిడ్డలు. అఖరికి కాంగ్రెస్ పాలనలో పోలీసోళ్ల భార్యలు ధర్నాలు చేసే పరిస్థితి.. వారు కూడా పోలీసోళ్ల చేతిలో దెబ్బలు తినే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు.
జైలుకు పోవడానికి రెడీ.. ప్రజలు, రైతుల కోసం ఒకట్రెండు ఏండ్లు జైల్లో ఉండేందుకు సిద్ధం. ఎవనీ అయ్యకు భయపడేది లేదు. తప్పకుండా కాంగ్రెస్ను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. అసలు చీటింగ్ కేసులు ఎవరి మీద పెట్టాలి.. తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిన ఈ చార్ సౌ బీస్గాని మీద కేసులు పెట్టాలి. రైతుబంధు ఎగ్గొట్టి, రుణమాఫీ చేయనందుకు రైతులు కేసులు పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి.. ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనందుకు యువత కేసులు పెట్టాలి. ఇలా అన్ని వర్గాలు పోలీసు స్టేషన్ల ముందు లైన్లు కట్టి చీటింగ్ కేసు పెడితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో మిగలడు అని కేటీఆర్ తెలిపారు.
పోలీసులను కోరుతున్నా.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇలాంటి కిరాతక పనులు బీఆర్ఎస్ పాలనలో చేయలేదు. మంత్రినో, కంత్రినో ఫోన్ చేస్తే ఆగం కాకండి.. న్యాయం, ధర్మం ప్రకారం నడుచుకోండి. పోలీసులైనా, అధికారులైనా ఎక్స్ట్రాలు చేస్తే పేర్లు రాసిపెట్టి మిత్తితో సహా ఇస్తాం. రేవంత్ రెడ్డి రాజు, చక్రవర్తి కాదు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులతోనే కొట్లాడినం.. వీడెంత చిట్టినాయుడు.. గింతంత మనిషి.. వాని చూసి ఆగం కావొద్దు. ఉద్యోగులు పద్ధతి ప్రకారం ఉద్యోగం చేయండి. అతికి పోతే మా టైమ్ వచ్చాక మిత్తితో సహా ఇస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
ఇదే ఆదిలాబాద్లో ఖానాపూర్ చెరువు వద్ద 2 వేల ఇండ్లు కూలగొట్టేందుకు అధికారులు వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ ఇండ్లకు పర్మిషన్లు, పట్టాలు ఇచ్చారు. బాధితుడు బొడిగెం గంగన్న నాలుగు తిట్లు తిట్టిండు. ఇల్లు కూలగొడితే ఎవడన్న ఊకుంటాడా..? ఆయన తిట్టిండని ఆయన మీద కేసు పెట్టారు.. జైల్లో పెడుతారట.. వంద రోజుల్లో అన్ని చేస్తానని తప్పించుకున్న లుచ్చాగాళ్ల మీద కేసులు పెట్టాల్నా.? పేదల మీద కేసులు పెట్టాల్నా..? అల్లం బెల్లం ఇస్తామని అడ్డగోలు మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్లపై చీటింగ్ కేసులు పెట్టాలి. రైతుల మీద కేసులు పెడుతాం అంటే ఊరుకునేందుకు సిద్ధంగా లేమని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | మహారాష్ట్రకు వందల కోట్ల నగదు..! కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ : కేటీఆర్
MLC Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
KTR | ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా..? కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన కేటీఆర్