KTR | హైదరాబాద్ : మా సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర డీజీపీని కేటీఆర్, సీనియర్ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న ఒక్క రోజే రెండు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించి ఆధారాలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేశాం. విద్యార్థి నాయకుడు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టాం. 50 మంది కాంగ్రెస్ గుండాలు, తాగిన మత్తులో ఆకస్మికంగా రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారు. మా వాళ్లు తిరగబడి ఉంటే ఆ 50 మంది కాంగ్రెస్ మూకలు ఒక్కరు కూడా మిగిలేవారు కాదు. కానీ శాంతియుతంగా మేము నిరసన తెలుపాలని భావించాం. అందుకే ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడలేదు. పోలీసులే మా నిరసన దీక్షకు సంబంధించిన టెంట్ కూల్చేయటం ఆశ్చర్యం కలిగించింది అని కేటీఆర్ తెలిపారు.
నిన్న ఇద్దరు మహిళ జర్నలిస్టులు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయారు. వాళ్ల మీద కాంగ్రెస్ గుండాలు అసభ్యకరంగా దాడి చేశారు. వాళ్లేమైనా ముఖ్యమంత్రి లాగా బజారు బాష మాట్లాడారా? లాగుల తొండలు జొర్రకొడతాం, చెట్టుకు కట్టేసి కొడతాం అన్నారా? రుణమాఫీ అయ్యిందా? లేదా అని తెలుసుకోవటానికి వెళ్లారు. వారిపైన కూడా కాంగ్రెస్ చిల్లరగాళ్లు దాడి చేశారు. కాంగ్రెస్ గుండాలు వారిని వెల్దండ పోలీస్ స్టేషన్ వరకు వెంబడించారు. ఆ ఆడబిడ్డలు ఏం తప్పు చేశారు? వారికి సీఎం క్షమాపణం చెప్పాలి. నీ బండారం బయట పెట్టినందుకా? వారి మీద దాడి చేయించవ్. అంతే కాకుండా వాళ్ల మీద నికృష్టమైన భాషలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ చిల్లర మనుషులు ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
రుణమాఫీ విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి పోయి సమాధానం చెప్పలేని దద్దమ్మ ఈ సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై ఏ ఊరికైనా వెళ్దాం రా అని మేము సవాల్ చేస్తే రాలేదు. కానీ ఢిల్లీకి 20 సార్లు పోయిండు. క్షేత్రంలో తిరగాల్సిన సీఎం…ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారు. సీఎంకు దమ్ముంటే నువ్వు ఏ ఊరికి పోదామో చెప్పు. అక్కడికి వెళ్లి రుణమాఫీ అయ్యిందా అనే విషయాన్ని అడుగుదాం. ఎక్కడ కూడా చారాణ రుణమాఫీ కాలేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మనం పోలీసులను, వ్యవసాయ అధికారులను తప్పు బట్టాల్సిన పని లేదు. తప్పు ముఖ్యమంత్రిది, చేతకాని సన్నాసి సీఎంది. అయితే పోలీసుల మీద మాకు సానుభూతి ఉంది. కానీ కొంత మంది పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అది మంచిది కాదు. సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. అధికారం మారుతుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులకు సూచిస్తున్నా. తిరుమలగిరి ఘటనలో దాడి చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. మహిళా జర్నలిస్ట్లపై దాడులు చేసిన వారిపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. జర్నలిస్ట్లకే రక్షణ లేకపోతే…రాష్ట్రంలో సామాన్య పౌరుల పరిస్థితి ఏందీ? అని కేటీఆర్ నిలదీశారు.
మంచిర్యాలలో ఎమ్మెల్యే కారణంగా మా నాయకుడు గొంతు కోసుకున్నాడు. మొత్తంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి అధికారం చెలాయించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. నెల రోజుల్లో 28 హత్యలు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నగరానికి ఏమైంది అంటూ సీఎంకు దన్నుగా నిలిచిన పత్రికలే వార్తలు రాస్తున్నాయి. పోలీసు యంత్రాంగం మీద మాకు సానుభూతి ఉంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సీఎం అధికారం చెలాయిస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా మా పార్టీ యువకులను వేధిస్తున్నారు. ఇంకా ఇలాగే కొనసాగితే మా నుంచి ప్రతిఘటన కూడా తప్పదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దనే మేము ఇప్పటి వరకు ఊరుకుంటున్నాం. మా సహనాన్ని, చేతగాని తనం అనుకోవద్దు. మేము ప్రతిఘటిస్తే అప్పుడు మమ్మల్ని నిందించవద్దు. కొంతమంది పోలీసులు మంత్రుల బర్త్ డే కార్యక్రమాల్లో పరవశించి పోతున్నారు. డీజీపీకి ఇలాంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చండి. పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ లాంటి నేతల భవనాలను కూల్చేసి ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | రైతులు, జర్నలిస్టులపై దాడులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ప్రసవించిన మహిళ
Chandrababu | జగన్కు రంగుల మీద ఉన్న పిచ్చి పేదల మీద లేదు.. చంద్రబాబు సెటైర్లు