Manipur Violence | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ అల్లర్లపై లోక్సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం చేసింది. హింసాకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్కు వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు. కాగా, మణిపూర్ హింసాకాండ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలని బీఆర్ఎస్ ఎంపీలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీలు అన్నీ కలిసికట్టుగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
Floor leaders & MPs of @BRSparty in both houses of the parliament will raise the issue of #ManipurViolence and ensure that the Union Government acts decisively
The perpetrators of the heinous molestation should be punished swiftly as per law
We appeal to all parties cutting…
— KTR (@KTRBRS) July 20, 2023
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలతోపాటు మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. మణిపూర్ హింసపై రెండు నెలలుగా నోరు విప్పని ప్రధాని మోదీ.. కనీసం పార్లమెంట్లోనైనా ప్రకటన చేయాలన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ దఫా సమావేశాల్లో కేంద్రం 31 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నది. ఇందులో ఢిల్లీ ఆర్డినెన్స్, వ్యక్తిగత డాటా పరిరక్షణ, అటవీ పరిరక్షణ చట్టాల సవరణ, సినిమా పైరసీని అరికట్టడం వంటి బిల్లులు ఉన్నాయి.