MLA Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరును నాలుగు గోడల మధ్య పెట్టలేదని.. అనేక రివ్యూలు చేసి అందరి సమక్షంలో నిర్ణయించిన పేరే ధరణి అని తెలుపుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
రెవెన్యూ చట్టాలను మార్చేందుకు నిర్వహించిన పలు సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాటి సీఎం కేసీఆర్తో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో ఇప్పుడు ఆయనకు మంత్రిగా అవకాశం వచ్చింది. మిగతా మంత్రులు తిట్టినట్టే పొంగులేటి కూడా కొన్ని అనరాని మాటలు అన్నారు. కేసీఆర్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఒదిగి ఉంటే మంచిది. కేసీఆర్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నానని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ధరణి పేరు బాగాలేదని భూమత అని పెట్టుకుంటున్నారు. ధరణి పేరు పెట్టేందుకు చాలా మందిని అడిగారు కేసీఆర్. నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకోలేదు. ధరణి అనగానే కేసీఆర్ కనిపిస్తున్నారని, అందుకే భూమాత అని మార్చుతున్నారు. 2017లో ఎల్ఆర్యూపీ(ల్యాండ్ రికార్ట్స్ అప్డేషన్ ప్రోగ్రామ్స్) తీసుకున్నాం. 584 మండలాల్లో 10828 గ్రామాల్లో 15700 బృందాలు భూరికార్డులను పరిశీలించాయి. ఇందుకోసం 10809 రెవెన్యూ ఉద్యోగులు 24 వేల వీఆర్ఏలు, 535 సర్వేయర్లు కలిసి గ్రామాల్లో రికార్డులు పరిశీలించి సమాచారం తీసుకున్న తర్వాతనే పార్ట్-ఏ, పార్ట్-బీ అని పెట్టారు. పార్ట్-ఏలో వివాదాల్లేని 90 శాతం భూములు రికార్డు అయ్యాయి. 2017లో 100 రోజుల్లో ఈ పని చేశారు. వారికి బోనస్గా వేతనం ఇవ్వడం జరిగింది. ఇలాంటి చారిత్రక నిర్ణయం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
160 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని సర్వేలో తేలింది. దాంట్లో 142 లక్షల ఎకరాలు పార్ట్ ఏలో నిక్షిప్తమైంది. 18 లక్షల ఎరాల భూమి రకరకాల కారణాల చేత పార్ట్-బీలో పెట్టారు. పార్ట్-బీలో మూడు రకాల సమస్యలు వచ్చాయి. అన్నదమ్ముళ్ల మధ్య పంచాయతీ, గెట్టు పంచాయితీ, కోర్టు కేసులు ఉండొచ్చు. రెండోది రెవెన్యూ సమస్యల వల్ల, మూడోది ఐటీ పోర్టల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల కారణంగా 18 లక్షలు పార్ట్-బీలో పెట్టారు. ఆ ధరణి బాగాలేకపోతే మీరు ఎందుకు వినియోగిస్తున్నారు. పేరు మాత్రమే మార్చుతున్నారు. 82 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించి గ్రామ కంఠాలు, ఫారెస్టు, ఇతర ఇన్స్టిట్యూషన్లదిగా నిర్దారించబడింది. ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడిన భూమిని ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టారు అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | అసెంబ్లీలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదు.. సభకు తెలిపిన కేటీఆర్
KTR | ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే : ఎమ్మెల్యే కేటీఆర్