పెన్పహాడ్, జూలై 28 : ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ అన్నారు. మంగళవారం పెన్పహాడ్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొవాలని, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వీబీ జీ-రామ్ జీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు విస్తృతంగా చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించి జలసిరి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి నీటి చుక్కను సంరక్షించే దిశగా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిచి భూ భారతికి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఓటరు జాబితా సవరణ, సాదాబైనామ వంటి విషయాలపై చర్చించారు. నూతనంగా ప్రవేశ పెట్టిన భూ భారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ రాజశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ జానయ్య, సింగిల్ విండో చెర్మన్ నాథల జానకి రాంరెడ్డి, ఏఓ అనిల్ నాయక్, ఎంపీఓ రాజేశ్వర్, వైద్యాధికారి రాజేష్, ఏపీఓ రవి, ఆర్ఐ రంజిత్ రెడ్డి, అజీజా. ఈసీ మహేష్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.