నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 28: హుజూరాబాద్లో బీజేపీకి భారీషాక్లు తగులుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కమలాన్ని వీడుతున్నారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీలో చేర్చుకున్న ఈటలతో కార్యకర్తలు, నాయకులు ఇమడలేకపోతున్నారు. మాజీమంత్రి పెద్దిరెడ్డితోపాటు, పలువురు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేయగా.. తాజాగా బుధవారం నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి కిషన్రెడ్డి, రాష్ట్ర నాయకుడు మూడెత్తుల మల్లేశ్యాదవ్ కమలాన్ని వీడారు. జమ్మికుంటలో భారీ ర్యాలీతీసిన మల్లేశ్యాదవ్ తన అనుచరవర్గంతో కలిసి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బీజేపీలో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపులేదని, దొంగలకు, కోవర్టులకు పట్టం గడుతున్నదని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కే సంతోష్కుమార్ యాదవ్, అనుపురం అఖిల్ గౌడ్ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. పొతరవేణి అనిల్కుమార్, దాసరి రాజు, జీ అశోక్ యాదవ్, గుండ అఖిల్ యాదవ్తో పలువురు యువకులు టీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్, కానిపర్తి, సిరిసేడు, వీణవంక, మాదన్నపేట గ్రామాలకు చెందిన బేడ బుడగ జంగాల బాధ్యులు, బీజేపీ కార్యకర్తలు జీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీలో ఈటల రాజేందర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పోరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈటల తీరు నచ్చక బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ఆయన ప్రకటించారు. వ్యక్తిగతస్వామ్య విధానంతో ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ ఆస్తులను కాపాడుకొనేందుకే పార్టీలోకి వచ్చినట్టు ఈటల తీరు చూస్తుంటే అర్థమవుతున్నదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ ఈటల వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఆత్మగౌరవం చంపుకోలేకే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని పోరెడ్డి కిషన్రెడ్డి వెల్లడించారు.