హైదరాబాద్ : నిర్మల్ జిల్లా బాసరలో మరో పురాతన సరస్వతి శిల్పం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసర వాసి బలగం రామ్మోహన్ (టీచర్) బాసరలోని పాపహరేశ్వర దేవాలయపు గర్భగుడిలో కొత్తదైన పురాతన సరస్వతిశిల్పాన్ని గుర్తించాడు. కాగా, ఈ విగ్రహాన్ని ఇక్కడి ప్రజలు పార్వతి దేవతగా భావించి పూజిస్తున్నారు.
దేవతా ప్రతిమాలక్షణాలను పరిశీలించినపుడు ఆ మూర్తికి తలపై కరండమకుటం, చెవులకు చక్రకుండలాలు, మెడలో హారగ్రైవేయకాలు, కేయూరాలు, కంకణాలు, మణిమేఖల, జయమాల ధరించి ఉన్నది. ఈ దేవతామూర్తి చతుర్భుజి పై చేతులలో అంకుశం, పాశం, ముందు చేతులలో అక్షమాల, పుస్తకం ధరించి, ఎడమకాలిపై కుడికాలు పెట్టి అర్ధపద్మాసనంలో కూర్చున్న సరస్వతి అమ్మవారిగా గుర్తించారు.
ఈ దేవత తలవెనక ప్రభావళి ఉంది. శైలిని బట్టి ఈ శిల్పం రాష్ట్రకూట, చాళుక్యుల కాలంనాటిది. ఆసనభేదాన్నిబట్టి ఈ దేవత జైనధర్మ ప్రతిమ అయి ఉంటుందని రామ్మోహన్ తెలిపారు. వ్యాసపురి(బాసర) ఆలయంలోని సరస్వతి శిల్పాన్ని ప్రసిద్ధ చరిత్రకారులు బీఎన్ శాస్త్రి జైన సరస్వతిగా భావించారు. జైనమతంలో సరస్వతి ఆరాధన ఉన్నదని చెప్పడానికి ఉత్తర భారతదేశంలోని మధుర కంకాళిదిబ్బలో పీఠంమీద క్రీ.శ. 2వ శతాబ్దపు శాసనంతో లభించిన తలలేని రెండుచేతుల సరస్వతి శిల్పమే మొదటి ఆధారం.
ఇదే దేశంలోకెల్లా తొలిసారి లభించిన సరస్వతిదేవతా విగ్రహం. కొలనుపాకలో దొరికిన శ్రుతదేవి(విద్యాదేవి, సరస్వతి) మరొక ఆధారం. బాసరలోని పాపహరేశ్వరాలయమనే శిథిలమైన గుడిలో లభిస్తున్న శిల్పాలు కూడా జైనధర్మానికి సంబంధించినవి ఎక్కువని అన్నారు.
ఈ గుడి మంటప స్తంభాలమీద జైనులైన సెట్టిలు వేయించిన లఘుశాసనాలున్నాయి. సరస్వతి శిల్పాలు లభించిన బాసర ఒకప్పటి జైనవిద్యా కేంద్రంగా చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Road accident : బర్రెను తప్పించబోయి కిందపడ్డ బైక్..ఇద్దరు చిన్నారులు మృతి
మందుపాతర పేలి గ్రే హౌండ్స్ ఆర్ఎస్కి తీవ్ర గాయాలు
Ileana D’Cruz | ఇలియానా అందాల అరబోత..