Pavel Durov : టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ను రష్యా మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై రష్యా అతడిని ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్బీఎస్) ఈ ప్రకటన చేసింది. ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని ప్రోత్సహించే కంటెంట్ను కట్టడి చేయడంలో టెలిగ్రామ్ విఫలమైందని రష్యా ఆరోపించింది. పలు టెలిగ్రామ్ ఛానెళ్లు, చాట్లను రష్యా వ్యతిరేక చర్యలకు ఉపయోగిస్తున్నప్పటికీ.. వాటిపై టెలిగ్రామ్ తగిన చర్యలు తీసుకోలేదని రష్యా విమర్శించింది.
ఇదే సమయంలో కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లను ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తోందని కూడా రష్యా ఆరోపించింది. టెలిగ్రామ్ను వాడుకుని కొందరు రష్యన్లు ఉక్రెయిన్ రహస్యంగా నియమించుకుంటోందని, దీనివల్ల అక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని రష్యా అంటోంది. ఈ యాప్ ద్వారా రష్యా వ్యతిరేక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే టెలిగ్రామ్ సంస్థపై ఆరోపణలు చేస్తూ, ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇటీవల టెలిగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ఫాంల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు నియంత్రణకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోనూ ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్ను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వాటిని తన నియంత్రణలోకి తెచ్చుకుని పలు ఆంక్షలు విధించింది. అయితే, టెలిగ్రామ్ను మాత్రం కట్టడి చేయలేకపోయింది.
అందుకే రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మ్యాక్స్ అనే దేశీయ మెసేజింగ్ యాప్ వినియోగాన్ని కూడా రష్యా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విదేశీ యాప్ల వాడకాన్ని తగ్గించాలని పౌరులకు సూచిస్తోంది. ఇక టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్.. రష్యాలోనే జన్మించాడు. ఆ తర్వాత అతడు విదేశాలకు వెళ్లిపోయాడు. గత ఫిబ్రవరిలోనే రష్యా తనపై మోపిన అభియోగాలపై పావెల్ స్పందించారు. వ్యక్తిగత సమాచార గోప్యత, భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందువల్లే తనపై తప్పుడు కేసులు పెడుతోందని పావెల్ విమర్శించారు.